ఏలూరులోని పదవ తరగతి పరీక్షల నిర్వహణను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
పెదవేగి/ ఏలూరు, మార్చి , 16 : జిల్లాలో పదవ పరీక్షలలో మాస్ కాపీయింగ్ జరగకుండా సిసి కెమెరాల ద్వారా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. పెదవేగిలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో సోమవారం పదవ తరగతి పరీక్షల నిర్వహణను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతీ రూమ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో పదవ తరగతి పరీక్షలకు 24 వేల 19 మంది విద్యార్థినీ విద్యార్థులు 133 పరీక్షా కేంద్రాలలో హాజరవుతున్నారన్నారు. ఈనెల 16వ తేదీ నుండి ఏప్రిల్,1వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షల నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతీ పరీక్షా కేంద్రాల హాల్స్ లో సిసి కెమెరాలతో నిఘా ఏర్పాటుచేయడం జరిగిందని, ఎక్కడైనా మాస్ కాపీయింగ్ జరిగితే సంబంధిత ఇన్విజిలేటర్ పై చర్యలు తీసుకుంటామని, ఎక్కడా మాస్ కాపీయింగ్ జరగకుండా ఇన్విజిలేటర్లు పర్యవేక్షించాలన్నారు. పరీక్షా కేంద్రాలలో సెల్ ఫోన్ లను ఎట్టిపరిస్థితులలోనూ అనుమతించవద్దన్నారు. పరీక్షా కేంద్రాల సమీపంలో జిరాక్స్, ఇంటర్ నెట్ సెంటర్ల ను పరీక్ష ముగిసేవరకు ఆయా షాపులను మూసివుంచాలన్నారు. వేసవి దృష్ట్యా పరీక్షా కేంద్రాలలో త్రాగునీరు, పారిశుద్యం ఏర్పాట్లను పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని సమస్యలు ఏమైనా ఉంటె 9491395377 కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేయాలన్నారు. అనంతరం పాఠశాలలోని సిసి కెమెరాల పర్యవేక్షణ విభాగాన్ని కలెక్టర్ పరిశీలించారు.
కలెక్టర్ వెంట డీఈఓ వెంకటలక్ష్మమ్మ, తహసీల్దార్, ఎంపిడిఓ, ప్రభృతులు పాల్గొన్నారు.