Close

ఏలూరు జిల్లాలో వరద పరిస్థితి పూర్తి అదుపులో ఉందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు

Publish Date : 22/07/2024

ఏలూరు/వేలేరుపాడు, జులై, 22 : ఏలూరు జిల్లాలో వరద పరిస్థితి పూర్తి అదుపులో ఉందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని వరద ప్రభావిత గ్రామాలలో పర్యటించిన అనంతరం దాచారం లో వరదల నష్ట నివారణపై జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలను పాత్రికేయులతో కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ వరద కారణంగా ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టాలు జరగకుండా 5 కేంద్ర, రాష్ట్ర విపత్తు నివారణ బృందాలు, 12 బోట్లు ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా వివిధ ప్రాంతాలలో సిద్ధంగా ఉంచామన్నారు. అత్యవసర పరిస్థితిలో వినియోగార్థం హెలికాప్టర్ లు రాజమండ్రిలో సిద్ధంగా ఉన్నాయన్నారు. వరద నీటిలో ముంపునకు గురైన గ్రామాలు, వరదల కారణంగా రహదారి సౌకర్యం దెబ్బతిన్న గ్రామాలను బోట్ల ద్వారా వెళ్లి పరిశీలించి, అక్కడ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నామన్నారు. అక్కడి ప్రజలకు 3 రోజులకు సరిపడా బియ్యం,కందిపప్పు, వంటనూనె, కూరగాయలు, మంచినీరు ప్యాకెట్లు అందించడం జరిగిందన్నారు. పెదవాగు వరద ముంపు పరిస్థితి తీవ్రత ప్రస్తుతం లేదని, వరద నీరు తగ్గుతూ ఉందన్నారు. వరద సహాయక కేంద్రాలలో కూడా వరద బాధితులకు భోజన, వసతి సౌకర్యాలు కల్పించామన్నారు. వరద బాధితులకు సహాయక చర్యలు సక్రమంగా అమలు చేసేందుకు ప్రతీ గ్రామానికి, మండలానికి ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందన్నారు. ఎక్కడా ఎటువంటి అవాంతరాలు లేకుండా సహాయక కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయన్నారు.
జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిశోర్ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం వరదలలో నష్ట నివారణకు ముందస్తుగా తీసుకున్న కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టాలు జరగలేదన్నారు. అత్యవసర పరిస్థితిలో వినియోగం నిమిత్తం 5 కేంద్ర,రాష్ట్ర విపత్తు నివారణ బృందాలు, 12 బోట్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. వరద సమయంలో మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకున్నారన్నారు. వరదల సమయంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు సమాచార వ్యవస్థకు ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు.