Close

జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి,జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్

Publish Date : 03/12/2024

ఏలూరు ,డిసెంబర్ 3 : రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు.

స్థానిక కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో మంగళవారం రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి,జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ పాల్గొన్నారు .

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమాలు పాటించడం అందరి కర్తవ్యం అన్నారు.ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్లు ఉపయోగించుకునేలా మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. గత నెలలో హెల్మెట్ వినియోగంపై నిర్వహించిన తనిఖీల పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. రవాణా ,పోలీస్ శాఖలు కలసి 6 వేలకు పైగా కేసులు నమోదు చేసి రూ.14.25 లక్షలు జరిమానాలను విధించడం జరిగిందన్నారు. హెల్మెట్ ఉపయోగించడం పై జిల్లా అధికారులు, జూనియర్ డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు,వివిధ వర్గాల ప్రజలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. హిట్ అండ్ రన్ కేసుల సంబంధించి ఉన్న 46 కేసులను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడంతోపాటు తరచూ ప్రమాదాలు జరిగే హాట్ స్పాట్ లోను గుర్తించి వాటిని సరి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా గత సమావేశంలో చర్చించిన వివిధ అంశాల పరిష్కార తీరును సమీక్షించారు .

గుడ్ సమరటెన్స్ చట్టం ప్రమాద బాధితులను సకాలంలో కాపాడిన గుడ్ సమరిటన్స్ కింద గుర్తించబడిన వారికి సత్కరించడం జరుగుతుందన్నారు. విలువైన ప్రాణాలను కాపాడేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేవారిని గుర్తించి వారికి నగదు ప్రోత్సాహం అందించడం జరుగుతుందన్నారు ఈ చట్టం కింద రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి గోల్డెన్ అవర్ సహాయం చేసే వారికి పోలీసు వారి నుండి భద్రత భద్రత కల్పించడంతోపాటు సివిల్ క్రిమినల్ కేసుల వంటివి వుండవని,హాస్పిటల్ వద్ద వేసి ఉండవలసిన అవసరం కూడా ఉండదన్నారు. ఈ దృష్ట్యా రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేయడానికి ప్రజల ముందుకు రావాలన్నారు. గోల్డెన్ అవర్ అంటే గాయపడిన మొదటి గంటలో బాధితులు బతికే అవకాశాలు పెంపొందించేందుకు ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. ఈ చట్టంపై అందరిలో అవగాహన కల్పించాలన్నారు. భయాలను పక్కనపెట్టి క్షతగాత్రులను కాపాడే ప్రయత్నం చేసే వారికి నగదు ప్రోత్సాహంతో పాటు ప్రాణదాత గుడ్ సమ్మర్టన్ సర్టిఫికెట్ కూడా అందించడం జరుగుతుందన్నారు. ప్రజలలో ప్రమాద బాధితులకు సాయం చేయాలని స్పృహను పెంపొందించాలన్నారు . ఆర్టీసీ బస్సులు రోడ్డు ప్రమాదాలు గురికాకుండా సంబంధిత డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. జాతీయరహదారి ఆ నుకుని అనధికారికంగా ఏర్పాటు చేసిన దుకాణాలను గుర్తించి రోడ్డు ప్రమాదాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని వివిధ జాతీయ రహదారుల్లో చేపట్టవలసిన పలు భద్రతా చర్యలపై కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో గుర్తించిన 33 బ్లాక్ స్పాట్ లో తీసుకున్న చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

జిల్లా ఎస్పీ కె .ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు తరచు పోలీసు, రవాణా, ఎన్ హెచ్, తదితర అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ పటిష్టమైన చర్యలు తీసుకుంటున్న జిల్లా కలెక్టర్ కె. వెట్రీసెల్వి ని ఈ సందర్భంగా ఆయన అభినందించారు .రోడ్డు ప్రమాదాల నివారణకు బహుముఖ వ్యూహాలు అనుసరించవలసింది అన్నారు. ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లు తీసి శబ్ద కాలుష్యానికి గురి చేసే వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు అటువంటి సైలెన్సర్ లను తొలగించే మెకానిక్ షాపులపై కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. పాఠశాలలు, కళాశాలకు ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్స్ లేకుండా వచ్చేవారి సమాచారాన్ని పోలీసు శాఖకు అందిస్తే అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. హెల్మెట్ వినియోగంపై ఆయన మాట్లాడుతూ జూనియర్ ,డిగ్రీ, ఇంజనీరింగ్ యాజమాన్యాలు హెల్మెట్ ధరించకుండా కళాశాలకు ద్విచక్ర వాహనంతో వచ్చే విద్యార్థులకు ప్రవేశం నిషేధించాలని సూచించారు.

సమావేశంలో ఉప రవాణా కమిషనర్ కరీమ్, ఆర్ అండ్ బి ఎస్ఈ జాన్ మోషే, డిఎంహెచ్వో ఎస్ శార్మిష్టా, డిసిహెచ్ఎస్ పాల్ సతీష్, జిల్లా ప్రజా రవాణా అధికారి వరప్రసాద్, మున్సిపల్ కమిషనర్ ఏ భాను ప్రతాప్,పలువురు జాతీయ రహదారుల ప్రాజెక్టు డైరెక్టర్లు, పలువురు రవాణాశాఖ అధికారులు పోలీసు అధికారులు,తదితరులు పాల్గొన్నారు.