మిషన్ వాత్సల్య పథకం అమలుకు అధికారులు మరింత సమన్వయం తో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఏలూరు, మార్చి , 17 : మిషన్ వాత్సల్య పథకం అమలుకు అధికారులు మరింత సమన్వయం తో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో సోమవారం జిల్లా బాలల సంక్షేమం,రక్షణ కమిటీ సమావేశంలో మిషన్ వాత్సల్య కార్యక్రమం అమలుపై పోక్సో కోర్ట్ జడ్జ్ ఎస్. ఉమా సునంద తో కలిసి కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ సమాజంలో నిరాదారణకు గురైన బాలలకు రక్షణ కల్పించి వారికి మిషన్ వాత్సల్య కార్యక్రమం ద్వారా విద్యా, ఆరోగ్యం అందించి సమాజంలో వారిని అభివృద్ధిపధంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ పధకం ద్వారా ప్రతి బిడ్డకు ఆరోగ్యకరమైన, సంతోషకరమైన బాల్యాన్ని అందించడమే ప్రధాన లక్ష్యమన్నారు. జిల్లాలో బాల్య వివాహాలు, బాల్య కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని , వీటిని మరింత పటిష్టం చేయాలన్నారు. బాలల హక్కుల పరిరక్షణకు అధికారులు పనిచేయాలన్నారు. గ్రామ/వార్డ్ సచివాలయాల పరిధిలో ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే నిలుపుదల చేసి, బాల్య వివాహం నిర్వహించే వారిపై కేసులు నమోదుచేయాలన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 69, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 64 బాల్య వివాహాల నుండి బాధితులను రక్షించి వారికి పునరావాస కార్యక్రమాలు అందించడం జరిగిందన్నారు. పోక్సో చట్టం కింద 2012 నుండి ఇంతవరకు 1144 కేసులు నమోదు చేయడం జరిగిందని, 2024 సంవత్సరంలో 148 కేసులు నమోదు చేసి 66 మందికి పరిహారం అందించడంతోపాటు 139 మందికి విద్య అందించి, సమాజంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్నామన్నారు.
పోక్సో కోర్ట్ జడ్జ్ ఎస్. ఉమా సునంద మాట్లాడుతూ పోక్సో కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు అవసరమైన పూర్తి సమాచారాన్ని కోర్ట్ వారికి సమర్పించేందుకు, బాధితులను కోర్ట్ లో హాజరు పరిచే సమయంలోను సంబంధిత శాఖల అధికారులు సమన్వయము తో పనిచేయాలన్నారు.
సమావేశంలో అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, జిల్లా పరిషత్ సీఈఓ భీమేశ్వరరావు, ఐసిడిఎస్ పీడీ కార్మిక శాఖ డిప్యూటీ కమీషనర్ పి . శ్రీనివాస్, డిసిపిఓ సీ హెచ్ సూర్య చక్ర వేణి, జిల్లా బాలల సంక్షేమ కమిటీ చైర్మన్ పి . వెంకటేశ్వరరావు, సభ్యులు కెల్లా హైమావతి, రాజేశ్వరరావు, ప్రభృతులు పాల్గొన్నారు.