మీకోసం అర్జీలు సత్వర పరిష్కారమే లక్ష్యం.

ఏలూరు,ఆగస్టు 19: మీకోసంలో ( ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ)అందిన అర్జీలను నాణ్యతతోపాటు నిర్ధేశించిన సమయంలోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.
సోమవారం ఏలూరు జిల్లా కలెక్టరేట్ లోని గోదావరి సమావేశం మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (మీకోసం) కార్యక్రమం లో ప్రజల నుంచి అర్జీలు, ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, జిల్లా రెవిన్యూ అధికారి డి. పుష్పమణి, డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు యం. ముక్కంటి, కె. భాస్కర్, అర్జీదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్బంగా 184 అర్జీలు మీకోసం లో నమోదు అయ్యాయి.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ అర్జీల పరిష్కార రేటును పరిశీలించి అర్జీదారుడు సంతృప్తిచెందిందీ లేనిదీ పరిశీలించాలన్నారు. ఎట్టి పరిస్ధితుల్లోను బియాండ్ ఎస్ఎల్ఎ లేకుండా అర్జీల పరిష్కారతీరు ఉండాలన్నారు. అర్జీదారుల సమస్యలను పరిష్కరించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీ దారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. అర్జీలు పెండింగ్, రీ ఓపెనింగ్ లేకుండా అర్జిదారుడు సంతృప్తి చెందేలా అర్జీల పరిష్కర తీరు ఉండాలన్నారు.
వార్షిక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు, 20వ తేదీ నుండి హౌస్ టూ హౌస్ పరిశీలనను బిఎల్ఓలు చేపట్టవలసివుందని ఈ విషయంపై తగు చర్యలు తీసుకోవాలని తహశీల్దార్లను కలెక్టర్ ఆదేశిచారు. ఓటర్ల నమోదుకు సంబంధిత 6,7,8 ధరఖాస్తుల పెండింగ్ ఉంటే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. విష జ్వరాలపై అందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెట్రిసెల్వి సూచించారు. ఈ విషయంపై విస్త్రృతంగా ప్రజలను అవగాహన పరచాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా మీ కోసం కార్యక్రమం వద్ద ఏర్పాటుచేసిన వైద్య శిబిరం ద్వారా కూడా అర్జిదారులకు విష జ్వరాలు,డెంగ్యూ వంటి వాటిపై మైక్ ద్వారా అవగాహన కల్పించాలన్నారు.
అందిన అర్జీలలో కొన్ని….
భీమడోలుకు చెందిన కొండా శిరీషా అర్జీనిస్తూ విభిన్న ప్రతిభావంతుల కింద ప్రస్తుతం 6 వేలు రూపాయలు పెన్షన్ పొందుతున్నామని తమ ఆరోగ్య పరిస్ధితుల దృష్ట్యా 15 పొందేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ సంబంధిత అంశాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, డిఆర్డిఏ అధికారులను ఆదేశించారు. ఏలూరుకు చెందిన కంది వెంకటేశ్వరరావు అర్జీనీస్తూ తమ స్ధలం సర్వే చేసి డాక్యుమెంటేషన్ మేరకు సరిహద్దులు నిర్దారించాలని కోరారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ను అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం కు చెందిన బిళ్ల శ్రీనివాసరావు అర్జీనిస్తూ తమ భూమికి సంబంధించి దస్తావేజు, పాస్ పుస్తకం ఉన్నాయని అయితే కొలతల ప్రకారం భూమి తగ్గుతుందని ఈ దృష్ట్యా సర్వేచేసి తమ భూమి నిర్ధారించాలని కోరారు.
కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.