Close

ఏలూరు జిల్లాలో ఎల్నినో ప్రభావం, సాగునీటి లభ్యతలపై రైతులకు అవగాహన కల్పించామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ కి తెలిపారు.

Publish Date : 28/07/2026

ఏలూరు, జూలై , 28 : ఏలూరు జిల్లాలో ఎల్నినో ప్రభావం, సాగునీటి లభ్యతలపై రైతులకు అవగాహన కల్పించామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ కి తెలిపారు. రాష్ట్ర సచివాలయం నుండి ఎల్నినో ప్రభావం, వర్షపాతం తగ్గుదల, సాగునీటి లభ్యత, 22ఏ దరఖాస్తుల పరిష్కారం, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ, రీ సర్వే , ఐవిఆర్ఎస్ సర్వే, రెవిన్యూ సమస్యల పరిష్కారం, తదితర అంశాలపై రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమీషనర్ జి. జయలక్ష్మి తో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంగళవారం రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా కలెక్టరేట్ నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో ఎల్నినో కారణంగా సాగునీటి లభ్యతలపై రైతులకు అవగాహన కలిగించి ఆరుతడి పంటలవైపు ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఏలూరు జిల్లాలో 22ఏ భూ సమస్యలకు సంబంధించి 410 దరఖాస్తులు అందాయని, వాటిలో 107 ఆమోదించామని,నిబంధనల మేరకు లేని 109 దరఖాస్తులను అందుకు గల కారణాలు తెలియజేస్తూ తిరస్కరించామన్నారు. ఈ సందర్భంగా సీఎస్ సాయి ప్రసాద్ మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులపై రైతు సేవాకేంద్రాల పరిధిలోని రైతులకు అవగాహన కలిగించాలన్నారు. ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రతీ జిల్లాలో కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుని అమలు చేయాలన్నారు. రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని, పంటల భీమా పథకంపై అవగాహన కలిగించి, ప్రతీ రైతుని పంటల భీమా పధకంలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.

జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, డిఆర్ఓ ఎం. శ్రీదేవి, నూజివీడు సబ్ కలెక్టర్ బి. వినూత్న, ఆర్డీఓ లు లక్ష్మీప్రసన్న, రమణ, ప్రభృతులు పాల్గొన్నారు.