కలెక్టర్ చొరవతో వృద్దుడికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్

ఏలూరు నగరంలో ఒక వృద్ధుడు తనకు పెన్షన్ అందలేదని జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి ఫోన్ 9491041188 నెంబర్ కు వాట్సాప్ ద్వారా తెలియజేయగా కలెక్టర్ వెంటనే స్పందించి అధికారులను ఆదేశించడంతో గంటల వ్యవధిలో ఆ వృద్దుడికి పెన్షన్ సచివాలయ సిబ్బంది పెన్షన్ అందించారు.
వివరాలలోకి వెళితే
పోలవరంనకు చెందిన సామజిక పెన్షన్ లబ్ధిదారు యు. వెంకటరమణమూర్తి జూన్, 29వ తేదీన ప్రమాదానికి గురవడంతో ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ నాలుగు వేల రూపాయలతో పాటు గత మూడు నెలల బకాయిలతో 7 వేల రూపాయలు పెన్షన్ అందిస్తున్నది తెలిసి, తాను ఏలూరులో ఉండడంతో తనకు పెన్షన్ రాదేమోనని ఆందోళనతో జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి కి వాట్సాప్ ద్వారా తన తమస్యను తెలియజేసారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రివర్యుల పర్యటన సందర్భంగా పోలవరంలో పర్యటిస్తున్న జిల్లా కలెక్టర్ సదరు వాట్సాప్ సమాచారంపై వెంటనే స్పందించి ఏలూరులోని డీఆర్డీఏ ప్రాజెక్ట్ అధికారిని సదరు వెంకటరమణమూర్తి కి ఏలూరు ఆసుపత్రిలో పెన్షన్ అందించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అధికారులు హుటాహుటిన స్పందించి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో యు. వెంకటరమణమూర్తి ని కలిసి సచివాలయ సిబ్బందిచే పెన్షన్ అందించారు. ఈ విషయంపై వెంకటరమణమూర్తి స్పందిస్తూ తనకు ఈ నెల పెన్షన్ అందుతుందో, లేదోనని ఆందోళన చెందానని, ప్రజల తమ సమస్యలను తన ఫోన్ నెంబర్ కు తెలియజేయవలసిందిగా దినపత్రికలలో జిల్లా కలెక్టర్ ప్రకటన చూసి వెంటనే తన ఫోన్ ద్వారా తన సమస్యను జిల్లా కలెక్టర్ వారి ఫోన్ తెలియజేసానని, తన సమస్యకు ఇంత త్వరగా పరిష్కారం లభిస్తుందని ఊహించలేదన్నారు. వెంటనే స్పందించి తన సమస్యను పరిష్కరించిన జిల్లా కలెక్టర్ కు వెంకటరమణమూర్తి తన కృతఙ్ఞతలు తెలియజేసారు.