Close

డీజిల్ ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా జిల్లా, రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ల వద్ద గట్టి నిఘా పెట్టాలి అధికారులు, తహశీల్దార్లతో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి టెలి కాన్ఫరెన్స్

Publish Date : 29/04/2026

ఏలూరు, ఏప్రిల్, 29 : మన జిల్లాలోని రైతుల అవసరాలే ప్రధానమని, డీజిల్ ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు తరలిపోకుండా పటిష్టమైన నిఘా పెట్టాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి బుధవారం జిల్లాలో డీజిల్ సరఫరాపై అధికారులు, తహశీల్దార్లతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో డీజిల్ కొరత లేకుండా సాధారణ స్థితి నెలకొందన్నారు. జిల్లాలో రైతులు, ప్రజల అవసరాలకు సరిపడా డీజిల్ నిల్వలు జిల్లాలో ఉన్నాయని, ప్రజలు డీజిల్ కొరత ఉంటుందేమోనని ఆందోళనలతో అధిక మొత్తంలో డీజిల్ కొనుగోలు చేయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఏలూరు జిలాల్లోని రబీలో వరి కోత యంత్రాలు, తదితర అవసరాల నిమిత్తం రైతులకు, ఆక్వా రైతులకు డీజిల్ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అధిక డిమాండ్ ఉన్న పెట్రోల్ బంక్ ల కు ట్యాంకర్లు పంపేలా చర్యలు తీసుకోవాలని, సదరు బంక్ ల వద్ద సిబ్బందిని నియమించి, డీజిల్ పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా జిల్లా, రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల వద్ద గట్టి నిఘా ఏర్పాటుచేసి, జిల్లా నుండి డీజిల్ తరలిపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రైతుసేవ కేంద్రంలోని సిబ్బంది వారి పరిధిలోని రబీ సాగు చేసిన రైతులు, ఆక్వా రైతుల డీజిల్ అవసరాలను తెలుసుకుని, వారికి అవసరమైన డీజిల్ అందించేలా చర్యలు తీసుకోవాలని, జిల్లాలో ఎక్కడైనా రబీ రైతులు, ఆక్వా రైతులు డీజిల్ సమస్యలు ఎదుర్కొంటే సంబంధిత సిబ్బంది బాధ్యత వహించవలసి వస్తుందన్నారు. డీజిల్ నిల్వలు పూర్తిగా కాకముందుగానే గుర్తించి ఇండెంట్ పెట్టేలా బంక్ యజమానులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలన్నారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఆర్డీఓ లు కిషోర్, రమణ, జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ భాషా, ఉద్యానవన అధికారి షాజా నాయక్, ప్రభృతులు పాల్గొన్నారు.