పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ప్రత్యేక అధికారి కె. ఆమ్రపాలి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి..

ఏలూరు/పెదపాడు, మే, 1: ప్రభుత్వం అందిస్తు ఎన్.టి.ఆర్. భరోసా పించన్లు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రత్యేక అధికారి, పర్యాటక అభివృద్ధి సంస్ధ మేనేజింగ్ డైరెక్టర్ కె. ఆమ్రపాలి పేర్కొన్నారు. గురువారం పెదపాడు మండలం వట్లూరులో ఎన్.టి.ఆర్. భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి లతో కలిసి గ్రామంలో పర్యటించి లబ్దిదారులకు పింఛన్లు అందజేశారు. పించనుదారులతో మాట్లాడి వారి యోగక్షేమాలను, కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్వాంగులు, వ్యాధిగ్రస్ధులకు ప్రభుత్వం పింఛన్లను పెద్దమొత్తంలో పెంచి అండగా నిలిచిందని లబ్దిదారులకు ప్రత్యేక అధికారి వివరించారు.
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో మే మాసపు ఎన్.టి.ఆర్. భరోసా పించన్లు అందించే క్రమంలో జిల్లాలో ఉన్న 2,59,685 మంది పించను దారులకు ప్రభుత్వం రూ. 112.98 కోట్లు విడుదల చేసిందన్నారు. గురువారం మధ్యాహ్నం నాటికే 2,21,148 మంది పించనుదారులకు రూ. 95.99 కోట్లు(85శాతం) పంపిణీ చేయడం జరిగిందన్నారు. పింఛన్ల పంపిణీకి 5,292 మంది సిబ్బంది ఉదయం 7.00 గంటల నుంచే పింఛన్ల పంపిణీ చేపట్టారన్నారు. మే 1వ తేదీన పింఛన్లు ఏదైనా కారణం చేత తీసుకోని వారికి మే 2వ తేదీ శుక్రవారం పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ స్వర్గీయ ఎన్.టి.ఆర్. హయాంలో రూ. 35 తో మొదలైన పింఛన్లు ఈనాడు 4 వేల రూపాయలకు చేరిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్న రూ. 4 వేల పింఛన్ లో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు హాయాంలో రూ. 2,840 కు పెరిగిందని గుర్తుచేశారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన పించన్లు తో సహా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేవలం 26 రోజుల్లో బకాయిలతో సహా పింఛన్ అందించడం జరిగిందన్నారు. సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రాధాన్యతకు ఇది మచ్చుతునక అన్నారు. గ్రామంలో పక్షవాతంతో మంచం పట్టిన వృధ్దుడుని పరామర్శించే సమయంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చూచి కన్నీటి పర్యాంతమయ్యారు. ఈ సందర్బంగా అతనికి ధైర్యానిస్తూ ఇప్పుడే ప్రత్యేక అధికారి వారు ప్రస్తుత పెన్షన్ ను రూ. 15 వేలుకు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగిందన్నారు.
వీరి వెంట డిఆర్డిఏ పిడి. డా. ఆర్. విజయరాజు, ఎఎంసి చైర్మన్ గారపాటి రామసీత, తహశీల్దారు కృష్ణజ్యోతి, యంపిడివో అమీల్ జమ, స్ధానిక నాయకులు కొమ్మన లక్ష్మణమోహన్, తదితరులు ఉన్నారు.