పొగాకు ప్రత్యామ్నాయ పంటలపై చర్చా వేదికలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

ఏలూరు, నవంబర్,22: పొగాకు పంటలో నియంత్రణ పాటించి లాభసాటి అయిన పొగాకు పంటకు ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు.
శుక్రవారం స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పొగాకు ప్రత్యామ్నాయ పంటలపై రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో చర్చావేదిక నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రకృతి వ్యవసాయ విస్తరణలో మహిళా సంఘాలు ఆచరించవలసిన సప్తసూత్రాలు తెలిపే గోడ పత్రికను కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ పొలంలో రైతులు అడుగులు వేస్తేనే మనం అన్నంలో చేయిపెట్టగలమనే వాస్తవాన్ని ఎప్పటికీ మరువకూడదన్నారు. అటువంటి రైతుకు అన్ని విధాలా అండగా ఉంటామని కలెక్టర్ భరోసా ఇచ్చారు. పొగాకు మూలంగా కలిగే రుగ్మతలు, అనార్ధాలు, దుష్పలితాలు దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టిసారించాలని సూచించారు. ఆయిల్ ఫామ్, అపరాలు, మొక్కజొన్న, ఉధ్యాన పంటల సాగుపై దృష్టిసారించాలన్నారు. పొగాకు కన్నా పెట్టుబడి తక్కువ, మంచి ఆదాయం వచ్చే పంటలు ఉన్నాయని, ఆయా పంటల ద్వారా అధిక ఆదాయం పొందుతున్న ఆదర్శ రైతులు ఉన్నారన్నారు. ఒకేసారి మార్పు చెందమని కోరడంలేదని, ప్రస్తుతం పొగాకు సాగుచేస్తున్న రైతు పొగాకుకు బదులుగా కనీసం ఒక ఎకరంలో ప్రత్యామ్నాయ పంటలు వేసి చూడాలన్నారు. అదే విధంగా ఇతర రైతులు సాగుచేస్తున్న పంటల తీరును పరిశీలించేందుకు అవసరమైతే రైతులను ఆయా పంట క్షేత్రాలకు తీసుకువెళ్లి అవగాహన పరచడం జరుగుతుందన్నారు. భూసార పరీక్షలు నిర్వహించి ఏ పంటకు ఆ భూమి అనువైనదో శాస్త్రవేత్తల ద్వారా తెలియజేయడం జరుగుతుందన్నారు. ఆయా పంటల సాగులో అనుమానాలను ఈ సదస్సుద్వారా నివృత్తి చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో డ్రాగన్ ఫ్రూట్ సాగు మంచి ఫలితాలనిస్తుందన్నారు. అదే విధంగా ఆయిల్ ఫామ్, మొక్కజొన్నకు మంచి డిమాడ్ ఉందని, ఆయా పంటల సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహాలు కూడా అందుతున్నాయన్నారు. వివిధ పంటల సాగులో రైతులకు అవసరమైన ఆర్ధిక సహాయం అందించడంపై బ్యాంకర్లతో సమన్వయం చేయడం జరుగుతుందన్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగు విషయంలో సానుకూల దృక్పధంతో ముందుకు వెళ్లాలన్నారు. మైక్రోఇరిగేషన్ పై అవగాహన కూడా కల్పించాలని అధికారులకు సూచించారు. వివిధ పంటల సాగులో మెళుకువలు, ఆధునిక సాంకేతిక, సాగులో డ్రోన్ల సహాయం పై పూర్తి సమాచారాన్ని రైతులకు అందించాలన్నారు. గతంలో పంటలసాగులో సరైన సమయంలో అవగాహన మార్గదర్శకం ఉండేదికాదని, ప్రస్తుతం వీటిని విస్త్రృతస్ధాయిలో వ్యవసాయశాఖ అధికారులు అవగాహన పర్చే కార్యక్రమాలు చేపట్టారన్నారు. వాటిని రైతులు అందిపుచ్చుకోవాలన్నారు.
ఈ సందర్బంగా పలువురు రైతులు మాట్లాడుతూ పొగాకు కు ప్రత్యామ్నాయంగా పంట సాగుకు బ్యాంకర్ల సహకారం ఎంతో అవసరమన్నారు. పారిశ్రామిక రంగానికి ఇస్తున్న విధంగా ప్రోత్సహకాలను వ్యవసాయ రంగానికి అందించాలని సూచించారు.
సమావేశంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి హబీబ్ భాషా, ప్రిన్సిపల్ సైంటిస్టు సుబ్బయ్య, ఉధ్యానశాఖ డిడి ఎస్. రామ్మోహన్, రిసోర్స్ పర్సన్ జి ఎల్ కె ప్రసాద్, డాట్ సైంటిస్టు ఫణికుమార్, ఆచార్య ఎన్ జి రంగా విశ్వవిధ్యాలయం సైంటిస్టు రాఘవరెడ్డి, సైక్రియాటిస్టు కోమలి, పలువురు పొగాకు రైతులు తదితరులు పాల్గొన్నారు.