భీమడోలు లొ రేషన్ షాపుల ద్వారా రేషన్ పంపిణీ పునః ప్రారంభ కార్యక్రమం లో పాల్గొన్న ఉంగుటూరు శాననసభ్యులు పత్సమట్ల ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, జిల్లా జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి

ఏలూరు, జూన్, 1 : చౌకధరల దుకాణాల ద్వారా ఖచ్చితమైన తూకంతో, నాణ్యమైన సరుకులు ప్రజలకు అందించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రేషన్ డీలర్లకు సూచించారు. స్థానిక తంగెళ్లమూడిలోని యు . భ్రమరాంబ కు చెందిన 126 నెంబర్ రేషన్ షాపు , కర్రి మంగకు చెందిన 127 రేషన్ షాపులలో ప్రజలకు రేషన్ పంపిణీని ఆదివారం అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలోని 1123 రేషన్ దుకాణాల ద్వారా 6 లక్షల 20 వేల 146 కార్డుదారులకు రేషన్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. 65 సంవత్సరాల వయసు పైబడిన వారికి, దివ్యాంగులకు వారి ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నదన్నారు. ప్రజలకు సక్రమమైనరీతిలో రేషన్ సరుకులు అందించాలని రేషన్ షాపుదారులను కలెక్టర్ ఆదేశించారు. రేషన్ షాపులలో అందించే సరుకుల ధరల వివరాలు, స్టాక్ వివరాలను తప్పనిసరిగా బోర్డులో తెలియజేయాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయాలలో ఉదయం 8 నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుండి 8 గంటల వరకు రేషన్ షాపు తప్పనిసరిగా తీసి ఉంచాలన్నారు. రైస్ కార్డుదారులకు 15వ తేదీ వరకు సరుకులు అందించాలని, 65 సంవత్సరాల వయస్సు దాటి నడవలేని పరిస్థితులలో ఉన్న వృద్దులు, విభిన్న ప్రతిభావంతులకు వారి ఇళ్ల వద్దకు వెళ్లి 5వ తేదీలోగా రేషన్ సరుకులు అందించాలన్నారు. ఈ-పోస్ యంత్రంలో కార్డుదారులు వివరాల నమోదు, బియ్యం తూకం వేసే విధానాన్ని జిల్లా కలెక్టర్ దగ్గరుండి పరిశీలించారు. ప్రజల నుండి ఎటువంటి ఫిర్యాదులు లేకుండా పారదర్శకంగా రేషన్ పంపిణీ చేయాలనీ రేషన్ షాపుదారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా రేషన్ సరుకులు తీసుకున్న రైస్ కార్డుదారులతో కలెక్టర్ రేషన్ సరుకుల నాణ్యతను గురించి అడిగి తెలుసుకున్నారు.
జిల్లా కలెక్టర్ వెంట స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవకీదేవి, తహసీల్దార్ శేషగిరిరావు, డిప్యూటీ తహసీల్దార్ రమేష్, జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు రాజులపాటి గంగాధర్, ప్రభృతులు పాల్గొన్నారు.