Close

మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక అవగాహన కలిగించేందుకు నిర్వహించిన 5కె వాక్ థాన్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.

Publish Date : 01/06/2025

ఏలూరు, జూన్, 1 : మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడం అందరి బాధ్యతని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు.

ఆదివారం నషాముక్త్ భారత్ అభియాన్, అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక అవగాహన కార్యక్రమాల నిర్వహణలో భాగంగా విభిన్న ప్రతిభావంతుల శాఖ, పోలీస్, ఎక్సైజ్, ఈగిల్ టీమ్, వైద్య ఆరోగ్యశాఖ, సంయుక్త ఆధ్వర్యంలో వట్లూరు సర్. సి.ఆర్.ఆర్. మహిళా కళాశాల నుండి ఇండోర్ స్టేడియం వరకు నిర్వహించిన 5కె వాక్ థాన్ ను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించారు. వాక్ థాన్ లో సుమారు 600 మందికి పైగా వివిధ శాఖల అధికారులు, స్ధానిక ప్రజా ప్రతినిధులు, మహిళలు, విద్యార్ధినీ విద్యార్ధులు, క్రీడాకారులు, ఎన్ సిసి విద్యార్ధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్రగ్స్ నియంత్రణ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. పొగాకు రహిత సమాజానికి కృషి చేద్దామని ఏర్పాటు చేసిన సిగ్నేచర్ బోర్డుపై జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంతకాలు చేసారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం నషాముక్త్ భారత్ అభియాన్ ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు 1972 స్టేట్ టోల్ ఫ్రీ నెంబరు, నేషనల్ టోల్ ఫ్రీనెంబరు 14446 లకు అందించాలని కోరారు. మాదక ద్రవ్యాలకు ప్రభావితమైన వారిని ఆ మహమ్మారి వ్యవసనాల నుండి బయట పడేసేందుకు డి ఎడిక్షన్ కేంద్రాలు కూడా నిర్వహించబడుతున్నాయన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలకు నేటి యువత బానిసలై తమ ఉజ్జ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, జిల్లాలో యువత మాధకద్రవ్యాల బారిన పడకుండా ఉండేలా అన్ని పాఠశాలలు, కళాశాలల్లో మాదకద్రవ్యాల వినియోగం కారణంగా కలిగే దుష్ప్రభావాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమాలలో మాదకద్రవ్యాల బానిసలై విముక్తిపొందిన వారితో మాదకద్రవ్యాల దుష్ప్రభావాలను గురించి తెలియజేసినట్లైతే , యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా రక్షించవచ్చన్నారు. జూన్, 26వ తేదీన అంతర్జాతీయ మాదకద్రవ్యాల వినియోగం నివారణ దినోత్సవం సందర్భంగా జూన్, 1వ తేదీ నుండి జూన్, 26వ తేదీ వరకు మాదకద్రవ్యాల వినియోగం కారణంగా కలిగే దుష్ప్రభావాలపై విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జూన్,26వ తేదీన అంతర్జాతీయ మాదకద్రవ్యాల వినియోగం నివారణ దినోత్సవం సందర్బంగా పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలు రవాణా పై ప్రత్యేక నిఘా పెట్టాలని, గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలు రవాణా చేసే వారిపై కఠినమైన శిక్షలు పడేలా కేసులు నమోదు చేయాలన్నారు. జిల్లాను మాదకద్రవ్య రహితంగా తీర్చిదిద్ధేందుకు ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమైనదని, ప్రజలను ప్రధాన భాగస్వాములను చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పలితాలు గురించి అవగాహన కల్పించుకుని దానిని ఇతరులకు తెలియజేయాలని సూచించారు. ఈ నెల 26 వరకు నిర్వహించే అవగాహన కార్యక్రమాల్లో మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్ధాలపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు.ముఖ్యంగా డ్రగ్స్ అనర్ధాలపై విద్యార్ధి దశలో అవగాహన కల్పించాలన్నారు. తమ నియోజకవర్గ పరిధిలో ఉన్న విద్యాసంస్ధల్లో పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను విక్రయించిన వారికి, వినియోగించిన వారికి ప్రత్యేక సెక్షన్ ల ద్వారా శిక్షలు ఉంటాయనే విషయాన్ని పోలీస్, సంబంధిత శాఖలు విస్త్రృతంగా అవగాహన కల్పించాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గంజాయి సరఫరాను నియంత్రించేందుకు ఎక్సైస్, పోలీస్ తదితర శాఖలు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన చర్యలు తీసుకోవాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో 2019 నుండి 2024 వరకు గంజాయి, డ్రగ్స్ కు అడ్డుకట్ట వేయకపోగా రాష్ట్రాన్ని డ్రగ్స్ కేంద్రంగా మార్చారన్నారు. రాబోయే రోజుల్లో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అధికారం చేపట్టిన 45 రోజుల్లో అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టిందన్నారు.

వాక్ థాన్ లో ప్రతిభ కనపరిచిన వారికి మెడల్స్ బహుకరణ..

వాక్ థాన్ కార్యక్రమంలో అత్యంత ప్రతిభ కనపరిచిన 5 మంది పురుషులకు, 5 మంది మహిళలకు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మెడల్స్ బహూకరించారు.

కార్యక్రమంలో పాల్గొన్న అడిషనల్ ఎస్పీ నక్కా సూర్యచంద్రరావుకు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మెడల్ బహూకరించారు. దీనితోపాటు పురుషుల విభాగంలో ఎం.సిహెచ్ రాజు, ఎస్. భార్గవ్, డి. నరేంధ్ర బాబు, ఎక్సైజ్ శాఖకు చెందిన డి. శ్రీనివాసు, జి.ఎస్.కె. ధనరాజు లకు, మహిళల విభాగంలో కె.పి.డి.టి. స్కూల్ కు చెందిన విద్యార్ధినీలు జి. భవ్య వర్షిణి, సిహెచ్. లావణ్య, సెయింట్ థెరిస్సాకు చెందిన యం. జాహ్నవి ప్రియ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సిహెచ్. సూర్యచక్రవేణి, వి. మల్లికలకు కలెక్టర్ మెడల్స్ ను అందజేశారు.

కార్యక్రమంలో అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడి ఎం. ముక్కంటి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆవులయ్య, డిఎస్పీ డి. శ్రావణ్ కుమార్, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శివ రామ్మూర్తి, డిఎస్డిఓ శ్రీనివాసరావు, విభిన్న ప్రతితవంతుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రామ్ కుమార్, మున్సిపల్ కమీషనరు ఎ. భానుప్రతాప్, ఎ.ఆర్ డిఎస్పీ శేఖర్, డిఇఓ ఎం. వెంకటలక్ష్మమ్మ, ఎక్సైజ్ అసిస్టెంట్ కమీషనరు పాండురంగారావు, డిసిపివో సూర్యచక్రవేణి, ఎన్.సిసి కమాండెంట్ ప్రదీప్ యాదవ్, రెడ్ క్రాస్ ప్రతినిధులు మేతర అజయ్ బాబు, ఎన్ సిసి విద్యార్ధినీ, విద్యార్ధులు, పలువురు స్ధానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.