Close

మొక్కలు నాటండి- ప్రకృతిని కాపాడండి..

Publish Date : 03/06/2025

ఏలూరు,జూన్,3: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 5న జిల్లా వ్యాప్తంగా 4.50 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. మంగళవారం స్ధానిక కలెక్టరేట్ నుంచి ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున మొక్కలు నాటే కార్యక్రమంపై వివిధ శాఖల జిల్లా అధికారులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమీషనర్లు, ఎంపిడిఓ లు, తహసీల్దార్లు, ఈఓపి ఆర్ డిఓ అధికారులతో టెలీకాన్ఫెరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జూన్, 5వ తేదీన పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఒకేరోజు రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని, ఏలూరు జిల్లావ్యాప్తంగా 4.50 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. జిల్లాలోని 27 మండలాల్లో ఆయా శాఖల వారీగా మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్ధేశించడం జరిగిందన్నారు. జెడ్పి ఆధ్వర్యంలో 74,790, డ్వామా ఆధ్వర్యంలో 60,750, డిఆర్డిఏ ఆధ్వర్యంలో 54,000, డిపివో ఆధ్వర్యంలో 33,750, ఐసిడిఎస్ ఆధ్వర్యంలో 33,750, విద్యాశాఖ ఆధ్వర్యంలో 27,000, మెప్మా ఆధ్వర్యంలో 25,000, హౌసింగ్ ఆధ్వర్యంలో 27,000, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో 18,900, ఐడిడిఏ ఆధ్వర్యంలో 17,500, ఇలా మొత్తం 27 శాఖల ఆధ్వర్యంలో జూన్ 5వతేదీన 4.50 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా తీసుకున్నామన్నారు. సమీప నర్సరీల నుండి మొక్కలను తీసుకుని జూన్ 5వ తేదీన నాటేందుకు సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. మొక్కలు నాటేందుకు అవసరమైన గుంతలు, ట్రీ గార్డ్స్ సిద్ధం చేసుకోవాలన్నారు. . మొక్కల నాటే కార్యక్రమంలో ప్రజలను ప్రధాన భాగస్వాములుగా చేయాలన్నారు. మొక్కలను నాటడంతోపాటు, వాటి పరిరక్షణకు కూడా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.