వరకట్న నిషేధ చట్టంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం అత్యంత అవసరమని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి పేర్కొన్నారు …
ఏలూరు, ఏప్రియల్ 24:జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరం శుక్రవారం వరకట్న నిషేధ చట్టం–1961 అమలు కమిటీ సమావేశం జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టరుతో పాటు జిల్లా జాయింటు కలెక్టరు డా.యం.జె.అభిషేక్ గౌడ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో వరకట్న నిషేధ చట్టం–1961ను సమర్థ వంతంగా అమలు చేయడం, మహిళలుపై వరకట్న వేధింపులను నివారించడం, బాధితులకు తక్షణ సహాయం అందించడమే లక్ష్యంగా జిల్లా అడ్వైజరీ బోర్డు కమిటీ పనిచేయ్యాలన్నారు. ఈ చట్టంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. చట్టం ఉద్దేశ్యం, శిక్షలు, బాధితులకు లభించే రక్షణ, సహాయక వ్యవస్థలుపై గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. వరకట్న వేధింపులకు గురైన మహిళలు లేదా వారి కుటుంబ సభ్యులు వెంటనే ‘ఉమెన్ హెల్ప్లైన్ – 181’కు సమాచారం అందించ వచ్చనని, అదేవిధంగా మహిళలు శారీరక, మానసిక, సామాజిక వేధింపులకు గురైన సందర్భాల్లో ‘సఖి వన్ స్టాప్ సెంటర్’ ద్వారా ఉచితంగా అందించే న్యాయ, వైద్య, కౌన్సెలింగు, పోలీసు సహాయ సేవలను వినియోగించు కోవచ్చనన్నారు. గృహ హింస చట్టం క్రింద ఈ ఏడాది ఇప్పటి వరకు 98 కేసులు నమోదు కాగా 46 కేసులకు రాజీ చేయడం జరిగింది. మరో 10 కేసులు కౌన్సిలింగు దశలో వున్నాయని పిడి స్త్రీసంక్షేమ అధికారి జిల్లా కలెక్టరుకు వివరించారు. ఏలూరులో వున్న 2 ఫ్యామిలీ కౌన్సిలింగు కేంద్రాలతో పాటు జంగారెడ్డిగూడెం, నూజివీడు డివిజన్లో కూడా ఫ్యామిలీ కౌన్సిలింగు కేంద్రాలను ఏర్పాటు చేయ్యాలని జిల్లా కలెక్టరు అధికారులను ఆదేశించారు. వరకట్న నిషేధ చట్టం అమలులో శాఖలు పోలీసు, రెవెన్యూ, మహిళా శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. క్షేత్రస్థాయి సిబ్బందికి స్పష్టమైన మార్గనిర్దేశం అందించడంతో పాటు వరకట్నానికి వ్యతిరేకంగా సామాజిక బాధ్యతను పెంపొందించడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బందికి చట్టంలోని నిబంధనలు, బాధ్యతలను స్పష్టంగా తెలియజేయాలని, వరకట్నం ఇవ్వడం తీసుకోవడం నేరమని ప్రజలకు విస్తృతంగా తెలియజేసె విధంగా ప్రచారం చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో ఇంచార్చి ఆర్డీవో ఐ.కిషోరు, మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ అధికారి పి.శారద, డిఎస్ పి యు రవిచంద్ర, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.యు.శోభ, జిల్లా సోషల్ వెల్ఫేరు డిడి వై.విశ్వమోహన రెడ్డి. డిప్యూటీ కమిషనరు ఆఫ్ లేబరు శ్రీనివాసు, డిఆర్డిఏ పిడి టి.వి.విజయలక్ష్మి,చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి డా.సి.హెచ్. సూర్యచక్రవేణి, ఇతర అధికారులు, మానవత సభ్యులు నేతల అజయ్ బాబు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.