సున్నిత సమాచారాన్నివ్యాప్తి చేసే సమయంలో ముందుగా ఉన్నతాధికారులతో ధృవీకరించుకోవాలి ఉపాధ్యాయ సంఘాల నాయకులకు తెలియజేసిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
ఏలూరు, నవంబర్, 29 : ఏలూరు జిల్లాలో ఉపాధ్యాయులకు సెలవుల మంజూరు విషయంలో ఎటువంటి ఆంక్షలు విధించలేదని, ఆంక్షలు విధించారన్న విషయం అవాస్తవమని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి స్పష్టం చేశారు. ఇటీవల ఉపాధ్యాయులకు సెలవుల మంజూరులో ఆంక్షలు విధించారని ఉపాధ్యాయులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం ఉపాధ్యాయ సంఘాల నాయకులను జిల్లా కలెక్టర్ తన ఛాంబర్ కి పిలిపించి మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఉపాధ్యాయులకు వ్యక్తిగత సెలవులు 10 శాతానికి మించి ఇవ్వద్దని తాను ఆదేశాలు జారీ చేశానన్న విషయం అవాస్తవమన్నారు. తాను అటువంటి ఆదేశాలు జారీ చేయలేదన్నారు. ఈ విషయంలో ఉపాధ్యాయులు ఎటువంటి ఆందోళన చెందవద్దన్నారు. ఉపాధ్యాయులు, సంఘాల ప్రతినిధులు ఇటువంటి అవాస్తవాలను వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి సున్నిత సమాచారం తెలిసినప్పుడు సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ముందుగా ధృవీకరించుకోవాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులకు కలెక్టర్ చెప్పారు . ఏదైనా సమస్య ఉంటె వెంటనే మండల విద్యాశాఖాధికారి లేదా జిల్లా విద్యా శాఖాధికారిని కలిసి తెలియజేసినట్లైతే పరిష్కారానికి వారు చర్యలు తీసుకుంటారని కలెక్టర్ వెట్రిసెల్వి తెలియజేసారు.
జిల్లా కలెక్టర్ ను కలిసిన వారిలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ప్రభృతులు ఉన్నారు.