ఏలూరు నగరపాలక సంస్థలో డిప్యూటీ మేయర్ల ఎంపిక ఏకగ్రీవంగా ఎంపికైన పప్పు ఉమామహేశ్వరరావు, వందనాల దుర్గాభవాని లు
ఏలూరు, ఫిబ్రవరి, 3 : ఏలూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్లుగా 30వ డివిజన్ కార్పొరేటర్ పప్పు ఉమామహేశ్వరరావు, 47వ డివిజన్ కార్పొరేటర్ వందనాల దుర్గాభవాని లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక ఏలూరు నగరపాలక సంస్థ సమావేశపు హాలులో సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు ప్రిసైడింగ్ అధికారి పి . ధాత్రిరెడ్డి ఆధ్వర్యంలో డిప్యూటీ మేయర్ల ఎన్నిక కార్యక్రమం జరిగింది. ఏలూరు నగరపాలక సంస్థలో ఖాళీగా ఉన్న రెండు డిప్యూటీ మేయర్ స్థానాలకు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సోమవారం ఎన్నిక ప్రక్రియ జరిగింది. కార్యక్రమానికి 30 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు. ఏలూరు నగరపాలక సంస్థలో ఖాళీగా ఉన్న రెండు డిప్యూటీ మేయర్ స్థానాలకు 30వ డివిజన్ కార్పొరేటర్ పప్పు ఉమామహేశ్వరరావు, 47వ డివిజన్ కార్పొరేటర్ వందనాల దుర్గాభవాని లు నామినేషన్లు దాఖలు చేశారు. 30వ డివిజన్ కార్పొరేటర్ పప్పు ఉమామహేశ్వరరావు ను డిప్యూటీ మేయర్ పదవికి 36వ డివిజన్ కార్పొరేటర్ భీమవరపు హేమసుందరి ప్రతిపాదించగా, 12 వ డివిజన్ కార్పొరేటర్ కర్రి శ్రీనివాసరావు బలపరిచారు. 47వ డివిజన్ కార్పొరేటర్ వందనాలు దుర్గాభవాని ని డిప్యూటీ మేయర్ గా 37 డివిజన్ కార్పొరేటర్ పృద్వి శారద ప్రతిపాదించగా 28వ డివిజన్ కార్పొరేషన్ తంగిరాల అరుణ బలపరిచారు. ఇతర కార్పొరేటర్లు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయని కారణంగా డిప్యూటీ మేయర్లుగా ఎంపికైన పప్పు ఉమామహేశ్వరరావు, వందనాల దుర్గాభవాని లు డిప్యూటీ మేయర్లు గా ఎంపికైనట్లు జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి ప్రకటించి వారికి ధ్రువపత్రాలను అందించారు.
ఈ సందర్భంగా పప్పు ఉమామహేశ్వరరావు, వందనాల దుర్గాభవాని లను ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), నగర మేయర్ షేక్ నూర్జహాన్, కోఆప్షన్ సభ్యులు ఎస్.ఎం. ఆర్. పెదబాబు, సహచర కార్పొరేటర్లు అభినందించారు.
కార్యక్రమంలో ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ భానుప్రతాప్, అదనపు కమీషనర్లు, ప్రభృతులు పాల్గొన్నారు.