తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఆఖరి రోజు 29 అభ్యర్థులు 48 నామినేషన్ పత్రాలు దాఖలు
తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఆఖరి రోజు 29 అభ్యర్థులు 48 నామినేషన్ పత్రాలు దాఖలు
మొత్తంగా 49 అభ్యర్థులు 72 నామినేషన్ పత్రాలు దాఖలు
సోమవారంతో ముగిసిన నామినేషన్ల గడువు, 11న పరిశీలన, 13న ఉపసంహరణ
అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలను స్వీకరించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి
ఏలూరు,ఫిబ్రవరి 10: తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఆఖరి రోజు 29 మంది అభ్యర్థులకు చెందిన 48 నామినేషన్లు దాఖలయ్యాయి. సంబంధిత అభ్యర్థులు సోమవారం కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి వారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ క్రమంలో అభ్యర్థుల చేత రిటర్నింగ్ అధికారి ప్రమాణం చేయించారు. ఫిబ్రవరి 03వ తేదీన నోటిఫికేషన్ వెలువడగా, 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. సోమవారం తాజాగా 29 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఆఖరి రోజు దాఖలైన 48 నామినేషన్లతో కలిపి ఇప్పటి వరకు 49 మంది అభ్యర్థులకు చెందిన 72 నామినేషన్లు దాఖలయ్యాయి.
నామినేషన్ల పరిశీలన ప్రక్రియ 11న, ఉప సంహరణ 13న ఉంటుంది. పరిశీలన, ఉపసంహరణ పూర్తయిన తర్వాత బరిలో ఎంత మంది నిలుస్తారన్నది తేలుతుంది. దాని తర్వాత ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు గుర్తుల కేటాయింపు, ఇతర ప్రక్రియలు కొనసాగుతాయి.
ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచి నామినేషన్ల గడువు ముగిసే వరకు మొత్తం ప్రక్రియను ఆర్వో ఆదేశాల మేరకు ఏఆర్వో, జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు పర్యవేక్షించారు. ఎన్నికల సెల్ అధికారులు ఇతర సాంకేతిక ప్రక్రియలను పూర్తి చేశారు. అభ్యర్థులకు పూర్తి సహాయ, సహకారాలు అందజేశారు.
టిడిపి తరఫున పేరబత్తుల రాజశేఖరం తమ నామినేషన్ దాఖలు చేశారు. వీరితోపాటు కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ,రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు.