జీబిఎస్ సిండ్రోమ్ పై అప్రమత్తంగా ఉండాలి.. వైద్యాధికారులతో నిర్వహించిన విసి లో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.
ఏలూరు,ఫిబ్రవరి, 19: గులియన్ బారి సిండ్రోమ్(జీబిఎస్) వ్యాధిపై వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం వైద్యాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జీబిఎస్, ఇమ్యూనైజేషన్, మాతా శిశుమరణాల నివారణ తదితర వైద్య పరమైన అంశాలపై డిసిహెచ్ఎస్ డా. పాల్ సతీష్, డిఎంహెచ్ఓ డా. ఆర్. మాలిని, డిప్యూటీ డిఎంహెచ్ఓ డా. నాగేశ్వరరావు, ఎన్.టి.ఆర్. ఆరోగ్యశ్రీ జిల్లా కో-ఆర్డినేటర్ డా. రాజీవ్ లతో కలిసి జిల్లా కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జీబిఎస్ వ్యాధిని ఎదుర్కోవడానికి వైద్యాధికారులు అప్రమత్తంగా వ్యవహరించా
లన్నారు. ఈ వ్యాధిపై ఎటువంటి అపోహలకు తావులేకుండా ప్రజలల్లో అవగాహన కలిగించాలన్నారు. అనుమానస్పద కేసులను గుర్తించిన వెంటనే డిఎంహెచ్ఓ, డిసిహెచ్ఎస్ తోపాటు తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అవసరమైతే సంబంధిత కేసులకు మెరుగైన వైద్యం కోసం రిఫర్ చేయాలన్నారు. జీబిఎస్ సిండ్రోమ్ వ్యాప్తి, కారణాలు నిరోధానికి తీసుకోవల్సిన చర్యలపై వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్షించారు. వ్యాధి నిర్ధారణ చేయడానికి, అదుపుచేయడానికి అవసరమైన సదుపాయాలు, మందులు, చికిత్సా అందుబాటులో ఉన్నాయన్న సమాచారాన్ని ప్రజల్లో అవగాహన పర్చాలన్నారు. ప్రతిఒక్కరూ పరిశుభ్రత పాటించాలని, పరిశుభ్రమైన త్రాగునీరు, ఆహారాన్ని తీసుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ వ్యాధి లక్షణాలు ఏవైనా కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
వైద్యాధికారుల పనితీరు మెరుగు పడాలి
జిల్లాలో వైద్యాధికారుల పనితీరు మరింత మార్పు రావాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి స్పష్టం చేశారు. గర్భిణీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఇందుకు వారి ఆరోగ్య నివేదికను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. జిల్లాలో మాతా శిశు మరణాల నివారణే లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు. నూరుశాతం ఇమ్యూనైజేషన్ కార్యక్రమం జరగాలన్నారు. హాజరు విషయంలో నూరుశాతం కనబడాలని ఏరియా ఆసుపత్రుల మాదిరిగానే మిగిలిన ఆసుపత్రులు కూడా హాజరు శాతం మెరుగుపడాలన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించే విషయాన్ని సామాజిక బాధ్యతగా భావించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. వైద్య రంగంలోని ఆయా అంశాల వారీగా మెరుగైన ఫలితాలు సాధించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లో సాధించిన ప్రగతిని పరిశీలించుకుంటూ ఆయా ఆరోగ్యపరమైన అంశాల్లో జిల్లాను ముందుంచాలన్నారు.
గులియన్ బారి సిండ్రోం వ్యాధి లక్షణాలు…తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
గులియన్ బారి సిండ్రోం ఒక అరుదైన తీవ్రమైన నాడి సంబంధిత వ్యాధి. మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ నరాలపై దాడి చేయడం వలన వచ్చే వ్యాధి ఇది. దీని కారణంగా కాళ్లు చేతులు బలహీన పడటం, చలనం తగ్గిపోవడం, కొన్నిసార్లు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలుగుతాయి. ఈ వ్యాధి బాక్టీరియల్ మరియు వైరస్ ద్వారా సంక్రమిస్తుంది. కలుషితమైన ఆహారం మరియు నీరు త్రాగడం వలన వచ్చేఅవకాశం ఉన్నది.
లక్షణాలు.. :- చేతులలో, కాళ్లలో, నిస్సత్తువ. కాళ్ల నుండి చేతులకు తిమ్మిర్లు వ్యాపించడం, తీవ్రమైన నరాల నొప్పి, నిలబడడం నడవడం కష్టంగా ఉండటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించిన వెంటనే దగ్గరలో ఉన్న వైద్య సిబ్బందిని సంప్రదించాలి. చికిత్సలో అశ్రద్ద కనపరిచిన, ఊపిరి తిత్తుల మీద బాక్టీరియా మరియు వైరస్ దాడి చేయడం వలన మనిషి మరణించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నవి.
చికిత్స.. ప్రాథమిక దశలోనే గుర్తిస్తే దీని ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. ప్లాస్మా ఎక్స్చేంజ్ థెరపీ, ఇమ్యునో గ్లోబన్ థెరపీ వంటి పద్ధతులు ఉపయోగిస్తారు. చికిత్స పూర్తి స్తాయిలో తీసుకున్న ఎడల, నరాల బలహీనత నుండి, నెమ్మదిగా , పూర్తి స్తాయిలో కోలుకోగలరు.
తీసుకోవలసిన జాగ్రత్తలు..
మొదటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య పరీక్ష చేయించుకోవాలి, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, పరిశుభ్రమైన ఆహారాన్ని మరియు త్రాగు నీటిని తీసుకోవాలి, 100 డిగ్రీల సెల్సియస్ వరకు కాచి, చల్లార్చి ఆ నీరు త్రాగడం ద్వారా 100 శాతం ఈ వ్యాధిని నివారించవచ్చు.