Close

ఓటరు జాబితాలో తప్పుల్లేకుండా పారదర్శకంగా సవరణలు చేపట్టాలని అధికారులకు ఆదేశం..

Publish Date : 17/06/2026

ఏలూరు,జూన్ 17:ఏలూరు మండలం చోదిమెళ్ల గ్రామంలో చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి బుధవారం స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ఓటరు జాబితా సవరణ ప్రక్రియ,కొత్త ఓటర్ల నమోదు, మరణించిన మరియు ఇతర ప్రాంతాలకు మారిన వారి వివరాల తొలగింపు వంటి అంశాలను కలెక్టర్ పరిశీలించారు. బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) నిర్వహిస్తున్న పనితీరును సమీక్షించి, ఓటరు జాబితాలో ఎటువంటి పొరపాట్లు లేకుండా పూర్తి పారదర్శకతతో సవరణలు చేపట్టాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని, ప్రజల నుండి వచ్చే అభ్యర్థనలు, ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కు అత్యంత కీలకమని,ఖచ్చితమైన ఓటరు జాబితా తయారీకి ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పేర్కొన్నారు.

కలెక్టర్ వెంట జిల్లాపరిషత్ సీఈవో పి. జగదాంబ, నగర పాలక సంస్థ కమిషనర్ ఏ. భానుప్రతాప్, తహసీల్దార్ కె. గాయాత్రిదేవి తదితరులు ఉన్నారు.