Close

స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ లో జాతీయ స్థాయిలో ఏలూరు నగరపాలక సంస్థ కు గుర్తింపు అభినందించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

Publish Date : 08/09/2026

ఏలూరు, సెప్టెంబర్, 8 : వాయు కాలుష్య నియంత్రణలో ఏలూరు నగరం జాతీయ స్థాయి గుర్తింపును పొందింది. ఏలూరు నగరంలో వాయు కాలుష్యం 69 µg/m³ నుండి 61 µg/m³ కు తగ్గింపునకు అధికారులు చేసిన కృషి సత్ఫలితాలను ఇచ్చింది. నేషనల్ క్లీన్ ఎయిర్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (MoEF&CC) 2025-26 సంవత్సరానికిగాను నిర్వహించిన “స్వచ్ఛ వాయు సర్వేక్షణ్” లో ఏలూరు నగరం అద్భుత ఫలితం సాధించింది. వాయు కాలుష్యాన్ని నియంత్రించడంలో ఏలూరు నగరపాలక సంస్థ అధికారులు చేసిన కృషికి జాతీయస్థాయి గుర్తింపు లభించింది. వాయుకాలుష్యాన్ని నియంత్రించేందుకు ఏలూరు నగరంలో ఎండ్-టు-ఎండ్ పేవింగ్ రోడ్లు ఏర్పాటు, ఫౌంటెన్లు & పార్కుల అభివృద్ధి, సమీకృత ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ (NCAP నిధులు), ఘన వ్యర్థాల నిర్వహణ & C&D వేస్ట్ మేనేజ్‌మెంట్, పెద్దఎత్తున మొక్కల పెంపకం, వంట చెరుకు వినియోగం స్థానంలో LPG వినియోగం ప్రోత్సాహం, వంటి చర్యలతో నగరంలో వాయుకాలుష్యం నియంత్రించగలిగారు. చేసేపనిపట్ల చిత్తశుద్ధి, అంకితభావం ఉంటే ఎంతటి లక్ష్యాన్నైనా సాధించగలం అని ఏలూరు నగరపాలక సంస్థ అధికారులు నిరూపించారు. అధికారులు చేపట్టిన చర్యలతో దేశవ్యాప్తంగా కేటగిరీ-3 (3 లక్షల కంటే తక్కువ జనాభా) విభాగంలో 4వ ర్యాంక్ సాధించి గతంలో ఉన్న 31 వ ర్యాంకు నుండి 4వ ర్యాంకు చేరుకుంది.

“స్వచ్ఛ వాయు సర్వేక్షణ్” లో ఏలూరు నగరం కేటగిరి-3 లో జాతీయస్థాయిలో 4వ ర్యాంకు సాదించడంపట్ల అందుకు కృషిచేసిన అధికారులను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అభినందించారు. ఇదే స్పూర్తితో ఏలూరు నగరాన్ని మరింత సంపూర్ణ పారిశుద్ధ్య నగరంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.